అసత్య ప్రచారాలను నమ్మొద్దు
అద్దె బస్సుల యజమానులకు ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి
హైదరాబాద్, జూలై 24 (విజయక్రాంతి): టీజీఎస్ ఆర్టీసీ పరిధిలో సేవలు అందిస్తున్న అద్దె బస్సు యజమానులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి పేర్కొన్నారు. ఆర్టీసీలో అధికారులను మేనేజ్ చేయడానికి డబ్బులు అవసరమని, అద్దె బస్సు యజమానుల నుంచి డబ్బు వసూలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారాలను నమ్మొద్దన్నారు.
ఆర్టీసీలో అద్దె బస్సుల కొనసాగింపు, నిర్వహణకు సంబంధించిన అన్ని నిర్ణయాలు ప్రభుత్వ ఆదేశాలకు, సంస్థ నిబంధనలకు లోబడి పారదర్శకంగా తీసుకుంటామని ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటనలో ఆయన స్పష్టం చేశారు. అద్దె బస్సు యజమానులు అప్రమత్తంగా ఉండాలని, అనధికారిక, సంఘాల మాటలు.. ప్రచారాలను నమ్మీ ఎవరూ మోసపోవద్దని సూచించారు.






