28 February, 2026 | 6:27 AM

వర్షాకాలనికి ముందే ప్రాజెక్టుల్లో పూడికతీత

28-02-2026 02:18 AM

పనులను సత్వరమే ప్రారంభించాలి

నిధుల ప్రతిపాదనను మంత్రివర్గం ముందు పెడుతా..

కడెంలో పూడికతీత పైలెట్ ప్రాజెక్ట్ విజయవంతం

నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి): మట్టితో పేరుకుపోయిన ప్రాజెక్టు ల్లో రెండోదశ పూడికతీత పనులకు సత్వరమే శ్రీకారం చుట్టాలని నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలానికి ముందే పూడికతీత పనుల కు ఉపక్రమిస్తే వర్షాకాలంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఏర్పాటు చేసుకోవచ్చన్నారు.

మట్టితో పూడిపోయిన ప్రాజెక్టుల్లో నీటిసామర్థ్యం పూర్తిగా పడిపోవడంతో జాతీయస్థాయిలో ఇది ప్రధాన సమస్యగా ఉంద న్నారు. శుక్రవారం సచివాలయంలో నీటి పారుదల శాఖ అధికారులతో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చారిత్రాత్మక బాక్రానంగల్ నుంచి తెలంగాణ రాష్ట్రంలో సుప్రసిద్ధ శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరకు మట్టితో పూడిపోయి నీటిసామర్థ్యం నిలువలు పడిపోయాయని ఆందోళన వ్యక్తంచేశారు.

ప్రత్యేకించి శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో 120 టీఎంసీల సామర్థ్యం నుంచి ఏకంగా 80 టీఎంసీలకు పడిపోయిందని గణాంకాలతో సహా వివరించారు. మట్టితో లేదా ఇసుక మేటలతో ప్రాజెక్టులు పూడిపోయి నీటి సామర్థ్యం నిలువలు ఘోరంగా పడిపోయి. ఇది జాతీయ స్థాయి సమస్యగా పరిణమించినందున కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఇప్పటికే మొదటిదశలో చేపట్టిన పూడికతీత పనులు జాతీయస్థాయిలో పూడికతీత కోసం చేపట్టిన మార్గదర్శకాలతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు పోతున్న విషయాన్ని గుర్తుచేశారు.

పూడికతీత పనులకు అవసరమైన నిధులను సమకూర్చే ప్రతిపాదనలు రాష్ట్ర మంత్రివర్గం ముందుంచి ఆమోదం తీసుకుంటామని ఆయన తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కొనసాగుతున్న పూడికతీత పనులను ఆయన ప్రస్తావిస్తూ పైలెట్ ప్రాజెక్ట్ కింద కడెం ప్రాజెక్టులో మొదటిదశలో చేపట్టిన పూడికతీత విజయవంతం అయిందన్నారు. ఇక్కడ పూర్తిగా అత్యధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించినట్లు ఆయన వెల్లడించారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టుల్లో ఉండాల్సిన నీటి సామర్థ్యం నిలువలు.. వర్షాల ఉధృతికి వచ్చి చేరే నీటితో ఏర్పడ్డ నీటినిలువలు సమగ్రంగా అధ్యయనం జరిపి అంతిమ ప్రతిపాదనలు సిద్ధంచేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ నూతన ముఖ్యకార్యదర్శి ఈ శ్రీధర్, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ జీవన్‌పాటిల్, జాయింట్ సెక్రటరీ కే శ్రీనివాస్, ఈఎన్సీ రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.