ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన
ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి పరమేశ్వర్ రెడ్డి పిలుపుమేరకు శక్తి సాయి నగర్ డివిజన్లో కాంగ్రెస్ అధ్యక్షుడు ఎస్వీ కిట్టు ఆధ్వర్యంలో ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ కిట్టు మాట్లాడుతూ, ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి మూలస్తంభమని, ప్రతి అర్హుడైన పౌరుడు ఓటరుగా నమోదు చేసుకుని తన ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. కొత్తగా 18 సంవత్సరాలు నిండిన యువత తప్పనిసరిగా ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు.
ఇంటింటికీ వెళ్లి ఓటరు నమోదు, పేర్ల సవరణలు, మార్పులు-చేర్పులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కాంగ్రెస్ శ్రేణులు ప్రచారం నిర్వహించాయి. ప్రజాస్వామ్య విలువలను కాపాడడంలో ప్రతి ఓటు కీలకమని, ఓటు హక్కు పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. ఉప్పల్ నియోజకవర్గంలో ప్రతి అర్హుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు చేపడుతున్నామని, ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ నాయకులు కోరారు.






