22 April, 2026 | 10:11 PM

చేనేతపై కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్నచూపు..

22-04-2026 09:10 PM

- చండూరు మాజీ జెడ్పిటిసి కర్నాటి వెంకటేశం విమర్శలు

మునుగోడు(గట్టుప్పల్): చేనేత రంగంపై కాంగ్రెస్ ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని మాజీ జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం ఆరోపించారు. బుధవారం గట్టుప్పల్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.200 కోట్ల బడ్జెట్‌లో జీతభత్యాలకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చి, చేనేత కార్మికులకు ఎలాంటి ఉపయోగం కలగలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో సుమారు 20 వేల మొగ్గలు కలిగిన కార్మికులకు త్రిఫ్ట్ పథకం నిధులు ఇప్పటివరకు వారి ఖాతాల్లో జమ కాకపోవడం శోచనీయమని అన్నారు.

గత ప్రభుత్వం టెస్కో ద్వారా రూ.150 కోట్లు కేటాయించి, విద్యార్థుల యూనిఫామ్ బట్టల ఆర్డర్లను చేనేత రంగానికి ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ టెండర్లను రద్దు చేసి ప్రైవేటీకరణ వైపు అడుగులు వేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల బట్టలను టెస్కో ద్వారానే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.

చేనేత భరోసా పథకం అమలు కేవలం అవగాహన సదస్సులకే పరిమితమైందని, వడ్డీ మాఫీ, త్రిఫ్ట్ భరోసా, చేనేత సంక్షేమ పథకాల కోసం కనీసం రూ.1000 కోట్లు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.సహకార సంఘాల నుంచి బట్టలను కొనుగోలు చేసి చేనేత కార్మికులకు ఉపాధి కల్పించాలని, వృత్తిలో కొనసాగుతున్న కార్మికులకు జియోట్యాగింగ్ చేయాలని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పున్న కిషోర్, చిలుకూరి ఆంజయ్య, నారని జగన్, చేరుపల్లి కృష్ణ, నేలంటి వెంకటేశం, చేరుపల్లి నగేష్ ఉన్నారు.