ఉపాధ్యాయులు, ఎస్ఎస్ఏ సిబ్బంది సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలో పీఆర్టీయూ టీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అడే ప్రకాశ్ మాట్లాడుతూ 2023 జూలై నుంచి రావాల్సిన వేతన సవరణ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, కేజీబీవీ (సీఆర్టీ) ఉపాధ్యాయుల సమ్మర్ హాలిడే వేతనాల కోతను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేజీబీవీ, ఎంఆర్సీ సిబ్బందికి హెల్త్ కార్డులు వర్తింపజేయడం, పెండింగ్ బిల్లులు మంజూరు చేయడం, సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ మినహాయింపు, సీపీఎస్ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానం అమలు, కేజీబీవీ ఉపాధ్యాయులకు మినిమం టైమ్ స్కేల్, వీక్లీ ఆఫ్ సౌకర్యం, గత సమ్మె కాలానికి వేతనాలు చెల్లించడం, పాఠశాల ప్రారంభ సమయాన్ని ఉదయం 9:30 గంటలకు మార్చడం వంటి పలు డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఇస్లావత్ గోర్ సింగ్, మండల అసోసియేట్ అధ్యక్షుడు రాథోడ్ వసంతరావుతో పాటు జెడ్పీహెచ్ఎస్ బూరుగూడ, మోడల్ స్కూల్, బాయ్స్ కేజీబీవీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.






