చిన్నపాటి వర్షానికే చెరువుల్లా మారిన కాలనీ
- ప్రభుత్వ నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం
- చుట్టు ప్రక్కల ప్రభుత్వ కార్యాలయాలు
- శుభ్రత పట్టించుకోని బల్ధియ అధికారులు
రామచంద్రపురం, జూలై 5 (విజయక్రాంతి) : రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని మయూరి నగర్ లో చిన్నపాటి వర్షం కురిసినా కాలనీలోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు, కాలినడకన వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇటీవల రోడ్ల పనులు చేపట్టిన అధికారులు తవ్విన ప్రాంతాలను పూర్తిగా పూడ్చకుండా మట్టి రోడ్డునే అలాగే వదిలేయడంతో పరిస్థితి మరింత దారుణంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీరు నిల్వ ఉండటంతో ద్విచక్ర వాహనదారులు జారిపడి ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది. ఈ రోడ్డుపై నుండి ప్రభుత్వ అధికారులు ప్రయాణం చేస్తారు..
విద్యార్థులు ప్రయాణం చేస్తారు.. కానీ ఈ బాధ ఎక్కువగా అనుభవించేది విద్యార్థులు, ఉద్యోగస్తులు, చిన్నారులు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని కాలనీవాసులు చెబుతున్నారు. ప్రజలు పలుమార్లు అధికారుల దృష్టికి సమస్యను తీసుకెళ్లినా ఎలాంటి స్పందన లేదని, సంబంధిత శాఖ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్లను పూర్తిగా మరమ్మతు చేసి, వర్షపు నీరు నిల్వ ఉండకుండా శాశ్వత పరిశ్కారం చేపట్టాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు.






