బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
నిర్మల్,(విజయక్రాంతి): బ్యాంకులు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో, శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికానికి సంబంధించిన డిసిసి, డిఎల్ఆర్ సి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బ్యాంకుల సహకారం వల్ల ప్రజల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయని, దీనికోసం కావలసిన సహకారం బ్యాంకులు అందించాలన్నారు.
పేద ప్రజల ఉన్నతికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకులతో ముడిపడి ఉన్న ఎన్నో రకాల పథకాలు అమలు పరుస్తున్నాయని, ఇవి క్షేత్రస్థాయిలో అర్హులైన పేదలందరికీ అందివ్వాల్సిన బాధ్యత బ్యాంకర్లపై ఉందన్నారు. అలాగే సైబర్ నేరాలపై అప్రమత్తత, పొదుపు, బ్యాంకింగ్ పై అవగాహన కలిగేలా విస్తృత కార్యక్రమాలు చేపట్టాలన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలకు, మహిళా స్వయం సహాయక సంఘాలకు, రైతులకు, వీధి వ్యాపారస్తులకు, విద్యార్థులకు అందించు రుణాల మంజూరులో ఆలస్యం చేయకూడదన్నారు. వివిధ రకాల రుణాలకు అర్హులైన దరఖాస్తుదారులకు సంబంధిత రుణాలను అందజేయాలన్నారు. అనంతరం 2026 - 27 వార్షిక రుణ ప్రణాళిక నివేదికను ఆవిష్కరించారు.






