సీఎంపీఎఫ్ బోర్డు సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రశ్నించిన బీఎంఎస్
నస్పూర్,(విజయక్రాంతి): వారణాసిలో జరిగిన CMPF బోర్డు సమావేశంలో BMS ప్రతినిధులు కె లక్ష్మారెడ్డి, ఆశిష్ మూర్తిలు కార్మికుల సంక్షేమం, CMPF వ్యవస్థ బలోపేతం, పారదర్శకతకు సంబంధించిన పలు కీలక అంశాలపై యాజమాన్యాన్ని నిలదీసినట్లు శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ నాతాడి శ్రీధర్ రెడ్డి, ఏరియా సెక్రటరీ రాజారాం కిరణ్ కుమార్ శని వారం వెల్లడించారు. CMPF బోర్డు సమావేశంలో పెన్షన్ ఫండ్ స్థిరత్వంపై కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
CMPF రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం వల్ల అనేక కీలక నిర్ణయాలు ఆలస్యమవుతున్నాయని, కమిషనర్ను వెంటనే నియమించాలని, CMPF అడ్వాన్స్ల కోసం ఉద్యోగులు అనవసరంగా పలు పత్రాలు సమర్పించాల్సిన పరిస్థితిని తొలగించి, స్వీయ ధృవీకరణ (Self-Declaration) ఆధారంగా అడ్వాన్స్లను మంజూరు చేసే విధానాన్ని అమలు చేయాలని కోరారు. సుమారు 6.5 లక్షల మంది పెన్షనర్లకు సంబంధించిన సేవలను సులభతరం చేయడానికి ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను ఏర్పాటు చేయాలని కోరారు.
CMPF నిధులకు కస్టోడియన్గా డచ్ బ్యాంక్ (Deutsche Bank) అనే విదేశీ బ్యాంకును కొనసాగిస్తున్నారని, భారతదేశంలోని EPF వంటి సంస్థల నిధులు భారతీయ బ్యాంకుల ద్వారానే నిర్వహించబడుతున్నప్పుడు, CMPF నిధులను మాత్రం విదేశీ బ్యాంకు కస్టడీలో ఉంచడంలో ఆంతర్యం ఏమిటని, భారతీయ బ్యాంకుకు మార్చకుండా అడ్డుకునే నిబంధనలు ఏమైనా ఉన్నాయా? అని యాజమాన్యాన్ని ప్రశ్నించారన్నారు. ఈ అంశాలపై వామపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు యాజమాన్యాన్ని ప్రశ్నించడంలో ముందుకు రాకపోవడం విచారకరమన్నారు.






