దొంగతనం కేసును ఛేదించిన బిక్కనూర్ పోలీస్
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏఎస్పి చైతన్య రెడ్డి, సీఐ సంపత్, ఎస్ఐ ఆంజనేయులు దొంగతనం కేసు వివరాలను వెల్లడించారు. మండల కేంద్రంలోని గాజులపేట గల్లీలో ఒంటరిగా నివసిస్తున్న ఉప్పరి లచ్చవ్వ ఇంట్లో జరిగిన దొంగతనం కేసును పోలీసులు వేగంగా మూడు గంటల్లోనే ఛేదించారు.
పోలీసుల వివరాల ప్రకారం... గజ్జ స్వామి (54) అనే నిందితుడు బాధితురాలు ఉప్పరి లచ్చవ అనే వృదురాలు ఒంటరిగా నివసిస్తూ ఎక్కువ బంగారం ధరించడాన్ని గమనించి ముందుగానే పథకం రచించాడు. ఏప్రిల్ 12 సాయంత్రం 8:10 నుంచి 8:20 గంటల మధ్య ఆమె ఇంటిలోకి వెళ్లి, ఇంట్లో ఉన్న రోకలి కర్రతో తలపై దాడి చేసి మెడలో ఉన్న బంగారు పూస్తెల తాడు, గుండ్లను దోచుకున్నాడు. అనంతరం తన బైక్పై అక్కడి నుంచి పరారయ్యాడు.
ఈ ఘటనపై భిక్కనూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నం.123/2026 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. తదుపరి రోజు ఏప్రిల్ 13న చర్చ్ గేట్ వద్ద నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతను నేరాన్ని ఒప్పుకున్నాడనీ. నిందితుడి వద్ద నుంచి సుమారు 40 గ్రాముల బంగారు పూస్తెల తాడు, 10 గ్రాముల గుండ్లు, మొబైల్ ఫోన్, అలాగే TS 17 G 7391 నంబర్ గల బైక్ను స్వాధీనం చేసుకున్నారు అని ఏ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ఈ కేసును తక్కువ సమయంలోనే ఛేదించిన పోలీసులను స్థానికులు అభినందిస్తున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.




