సత్తుపల్లిలో విద్యాసంస్థల బంద్ విజయవంతం
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలి
27 వేల ప్రభుత్వ పాఠశాలను 4 వేల పాఠశాలకు తగ్గిస్తే ప్రభుత్వంపై ఉద్యమం తప్పదు
పెండింగ్లో ఉన్న ఫీజు నెంబర్స్మెంట్ స్కాలర్షిప్స్ విడుదల చేయాలి
విద్యార్థులతో సత్తుపల్లి పట్నంలో భారీ ప్రదర్శన
ఏ ఐ ఎస్ ఎఫ్. ఎస్ ఎఫ్ ఐ. పిడిఎస్యు
సత్తుపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్ర కమిటీ పిలుపులో మేరకు సత్తుపల్లి పట్నంలో ఉన్న విద్యాసంస్థలను ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పిడిఎస్యు ఆధ్వర్యంలో బంద్ నిర్వహించి అనంతరం సత్తుపల్లి పట్నంలో విద్యార్థులతో కలిసి భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మడుపల్లి లక్ష్మణ్ ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బెజవాడ సాయి శేషు పిడిఎస్ యు సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి షేక్ శిలారపాషా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగ సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని అన్నారు.
రాష్ట్రంలోని 27 వేల ప్రభుత్వ పాఠశాలలను 4 వేలకు కుదించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖకు పూర్తి స్థాయి మంత్రిని నియమించాలని, ఖాళీగా ఉన్న టీచర్లు, లెక్చరర్లు, ఎంఈఓ, డీఈఓ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. మధ్యాహ్న భోజన పథకానికి నిధులు పెంచి మహిళా సంఘాల ద్వారానే అమలు చేయాలని, మెస్ మరియు కాస్మోటిక్ చార్జీలను పెంచి పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని, బెస్ట్ అవైలబుల్ స్కీంకు రూ.250 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
అలాగే NEP-2020ను తెలంగాణలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలని, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజులను నియంత్రించాలని, ప్రైవేట్ పాఠశాలలకు ఫీజు నియంత్రణ విధానం అమలు చేయాలన్నారు. గత ఆరు సంవత్సరాలుగా స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలుగా రూ.10,500 కోట్లకు పైగా పెండింగ్లో ఉండడం వల్ల లక్షలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ నిధులను విడుదల చేసి, విద్యార్థులకు ఉచిత బస్ పాస్ సౌకర్యాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు.






