31 March, 2026 | 3:16 AM

ఆశావర్కర్లను కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించాలి

31-03-2026 12:00 AM

సూర్యాపేట, మార్చి 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో పనిచేస్తున్న ఆశ వర్కర్ లను రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్ట్ వర్కర్ గా గుర్తించి, కనీస వేతనం రూ.18 వేలు ఇవ్వాలని  పలువురు కార్మిక సంఘ నాయకులు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ అనుబంధ సంఘమైన ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు సెంటర్ నుండి కొత్త బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. తదుపరి కొత్త బస్టాండ్ సెంటర్లో రాస్తారోకో చేశారు. 

ఈ సందర్భముగా ఏఐటీయూసీ రాష్ట్ర కన్వీనర్ ఎన్.కవిత, రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావులు మాట్లాడుతూ ఆశా వర్కర్లకు పిఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రతి ఆశాకు 10 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం, లైఫ్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని మెడికల్ డిపార్ట్మెంట్లో నూతనంగా విడుదల చేసిన నోటిఫికేషన్లు ఆశల అర్హతలను బట్టి ఏఎన్‌ఎం, జిఎన్‌ఎమ్, ల్యాబ్ టెక్నీషియన్ తదితర పోస్టులలో ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.

ఏదైనా ప్రమాదవశాత్తు డ్యూటీలో చనిపోయిన ఆశకు 10 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియాతో పాటు ఒకరికి ఉద్యోగం ఇవ్వాలన్నారు. గత కొన్ని ఏళ్లుగా పెండింగ్లో ఉన్న సర్వేలు, పోలియో, ఎన్నికల విధులు, పరీక్ష పనికి సంబంధించిన బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. అక్రమంగా తొలగించిన ఆశలను వెంటనే  విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్స్ జిల్లా నాయకురాలు రాధా భాగ్యలక్ష్మి, విజయకుమారి, సైదమ్మ, ఉమా, హుస్సేనీ, సోమక్క, సిపిఐ పట్టణ కార్యదర్శి భూరా   వెంకటేశ్వర్లు, ఏ ఐ టి యు సి జిల్లా గౌరవ అధ్యక్షులు దంతాల రాంబాబు, గౌరవ సలహాదారులు శ్యామల అశోక్ తదితరులు పాల్గొన్నారు.