రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఉద్యమకారులు, పారిశుధ్య కార్మికులకు ఘన సన్మానం
సనత్నగర్,(విజయక్రాంతి): ప్రాణాలను ఫణంగా పెట్టి ఒక రాష్ట్రాన్ని సాధించిన గొప్ప నాయకుడు కేసీఆర్ అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మంగళవారం పలు ప్రాంతాలలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ముందుగా అమీర్ పేటలోని సత్యం థియేటర్ సర్కిల్ లో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన కు బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఉద్యమకారులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జాతీయ పతాకం, పార్టీ పతాకాలను ఎగురవేశారు. అనంతరం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి ప్రతిజ్ఞ చేయించారు. తదనంతరం ఉద్యమకారులను సన్మానించారు. అక్కడి నుండి తెలంగాణ తల్లి విగ్రహం వద్దకు చేరుకొని నివాళులు అర్పించారు. అక్కడే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారులు, మహిళా పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుదీర్ఘ కాలం పోరాడి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ నాయకత్వం లో జరిగిన పోరాటంలో ఉద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు భాగస్వాములైన విషయాన్ని గుర్తు చేశారు. స్వయం పాలన తెచ్చుకున్న తర్వాత 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో రాష్ట్రాన్ని అభివృద్ధి లో దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారని గుర్తు చేశారు. రాష్ట్ర ఏర్పాటు జరిగిన జూన్ 2 మనకు పండుగ రోజుగా ఆయన పేర్కొన్నారు.






