09-02-2026 12:11:25 AM
ఐదు పశువులు బలి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డీఎఫ్ఓ పద్మజ రాణి
నంగునూరు, ఫిబ్రవరి 8:సిద్దిపేట జిల్లాలోని మోయ తుమ్మెద వాగు పరివాహక గ్రామాల్లో పెద్దపులి సంచారం తీవ్ర భయాందోళనలు గురిచేస్తుంది. జిల్లా దాటి వెళ్లిపోయిందని భావించిన పులి, మళ్లీ యాదాద్రి జిల్లా నుంచి,జనగామ జిల్లా అమ్మపురం మీదుగా సిద్దిపేట జిల్లాలోని దూల్మిట్ట, మద్దూరు మండలాలు చేరుకుని అక్కడినుంచి నంగునూరు మండలం మీదుగా కోహెడ మండలంలో ప్రవేశించినట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు.
మద్దూరు మండలం లధ్నూర్, అమ్మాపూర్ గ్రామాల్లో శనివారం తెల్లవారుజామున లేగదూడలపై దాడి చేసిన పులి, ఆదివారం తెల్లవారుజామున నంగునూరు మండలం ఘనపూర్లో రైతు కరెడ్ల బాల్ రెడ్డికి చెందిన లేగదూడపై పులి దాడి చేయగా, గత రెండు రోజుల్లోనే మొత్తం ఐదు పశువులు మృతి చెందాయి.ఘటనా స్థలాన్ని సందర్శించన హుస్నాబాద్ ఎఫ్ఆర్ఓ సిద్ధార్థ రెడ్డి లభించిన పాదముద్రల ఆధారంగా అది పెద్దపులి దాడియేనని నిర్ధారించారు.
ప్రస్తుతం నాలుగు అటవీ శాఖ బృందాలు డ్రోన్లు, ట్రాప్ కెమెరాల సాయంతో గాలింపు చర్యలు చేపడుతున్నామన్నారు.పశువులను కోల్పోయిన రైతులకు తక్షణమే నష్టపరిహారం అందిస్తామని జిల్లా అటవీశాఖ అధికారి పద్మజ రాణి తెలిపారు. అయితే, కేవలం దాడి జరిగిన చోట మాత్రమే కాకుండా,పులి కదలికలను ముందే అంచనా వేసి విస్తృత స్థాయిలో బోన్లు,కెమెరాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.సాయంత్రం 4 గంటల తర్వాత ఎవరూ ఒంటరిగా బయటకు రావొద్దని, అటవీ ప్రాంతాల్లో లేదా వ్యవసాయ బావుల వద్ద పశువులను కట్టేయవద్దని హెచ్చరించారు.రాజగోపాలపేట ఎస్ఐ వివేక్ క్షేత్రస్థాయిలో పరిస్థితిని సమీక్షిస్తూ గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారు.