250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్
చివ్వెంల,(విజయక్రాంతి): కుడకుడ పరిధిలో చివ్వెంల పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో 250 గ్రాముల గంజాయితో ఓ యువకుడు పట్టుబడ్డాడు. ఈ రోజు ఉదయం అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని ఆపి తనిఖీ చేయగా, అతని వద్ద నిషేధిత గంజాయి లభ్యమైంది. పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, అతను కుడకుడ గ్రామానికి చెందిన జక్కలి వినయ్ అలియాస్ వినయ్ గౌతమ్ (22)గా గుర్తించారు. అతని వద్ద ఉన్న 250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, చివ్వెంల పోలీస్ స్టేషన్లో ఎన్డిపిఎస్ చట్టం కింద కేసు నమోదు చేశారు.
అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు సూర్యాపేట రూరల్ సీఐ జి. రాజశేఖర్ తెలిపారు. జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆయన పేర్కొన్నారు. మత్తు పదార్థాలు యువత భవిష్యత్తును దెబ్బతీస్తాయని, వాటికి దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిసినా, అనుమానాస్పద వ్యక్తులు కనిపించినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ప్రజల సహకారంతో డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని సీఐ తెలిపారు.






