13-02-2026 12:35:56 AM
ఇందిరా మహిళా శక్తి ఘన విజయానికి నిదర్శనం: మంత్రి సీతక్క
హైదరాబాద్, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): సమ్మక్క మహా జాతర- సందర్భంగా ములుగు జిల్లాలో ఇందిరా మహిళా శక్తి ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లు భారీ ఆదాయాన్ని ఆర్జించాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క, జిల్లా కలెక్టర్ మార్గదర్శకత్వంలో జిల్లాలోని 10 మండలాలను కవర్ చేస్తూ మొత్తం 565 ఆదాయ యూనిట్లను ఎస్హెచ్జీల ద్వారా ఏర్పాటు చేయగా వారు జాతర సమయంలో రూ.3 కోట్లకు పైగా ఆదాయాన్ని సంపాదించారు.
మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ తీసుకుని మేడారం జాతర ప్రాంగణంలో మహిళా సంఘాలకు అనుకూలమైన ప్రదేశాల్లో షాపులను కేటాయించారు. ములుగు జిల్లాలోని పది మండలాలకు చెందిన మహిళా సమాఖ్యల ద్వారా వివిధ రకాల వ్యాపార యూనిట్లు ఏర్పాట్లు చేయించి మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గాలు కల్పించారు. మంత్రి సీతక్క స్వయంగా ఈ యునిట్లను ప్రారంభించి వారి వ్యాపారానికి విస్తృత ప్రచారం కల్పించారు.
ప్రభుత్వ ప్రోత్సాహకం, బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాలు కల్పించడంతో మహిళలు కూల్ డ్రింక్ సెంటర్లు, చికెన్ సెంటర్లు, ఇప్పపువ్వు లడ్డూ స్టాళ్లు, బ్యాంబూ చికెన్, క్యాంటిన్లు, స్నాక్స్ తదితర దుకాణాలను ఏర్పాటు చేసి విజయవంతంగా నిర్వహించారు. జాతరలో ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఇతర వ్యాపార కార్యకలాపాల ద్వారా మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఆర్థికంగా లాభపడ్డారు.
ఈ వ్యాపారాల కోసం రూ.6 కోట్ల పెట్టుబడిని బ్యాంకులు, జిల్లా మహిళా సమాఖ్యల ద్వారా సమకూర్చగా మొత్తం రూ.9.12 కోట్ల ఆదాయం లభించింది. పెట్టుబడి ఖర్చులు పోగా రూ.3 కోట్లకుపైగా లాభం వచ్చింది. సీఎం రేవంత్ రెడ్డి నేతత్వంలో అమలవుతున్న ఇందిరా మహిళా శక్తి ఘన విజయానికి ఇది నిదర్శనమని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ప్రభుత్వ ప్రొత్సాహకం, మహిళా సంఘాల పట్టుదల, ఆడ బిడ్డల శ్రమ ఫలితమని మంత్రి అభినందించారు. గ్రామీణ మహిళలు ఆర్థికంగా బలపడుతూ స్వయం సమృద్ధి దిశగా ముందుకు సాగుతున్న ఈ ప్రయాణం దేశానికి ఆదర్శంగా నిలిచిందని ఆమె పేర్కొన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం గ్రామీణ మహిళల ఆర్థిక సాధికారతకు దృఢమైన పునాది వేసిందని మంత్రి సీతక్క ప్రశంసించారు.