బెంగాల్లోని 15 పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్
కోల్కతా: పశ్చిమ బెంగాల్లోని దక్షిణ 24 పరగణాల జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల రెండో దశలో భాగంగా ఏప్రిల్ 29న పోలింగ్ జరిగిన 15 కేంద్రాల్లో శనివారం రీపోలింగ్(West Bengal Repolling) జరుగుతోంది. పోలింగ్లో అవకతవకలు జరిగాయని ఎన్నికల సంఘానికి (EC) ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల అక్రమాలకు సంబంధించిన నివేదికల నేపథ్యంలో, ఎన్నికల సంఘం ఒక రోజు ముందే ఈ కేంద్రాల్లో రీపోలింగ్కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. మగ్రాహట్ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గంలోని 11 పోలింగ్ కేంద్రాల్లోనూ, డైమండ్ హార్బర్లోని నాలుగు కేంద్రాల్లోనూ రీపోలింగ్ నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమై, సాయంత్రం 6 గంటల వరకు కొనసాగుతుందని అధికారి తెలిపారు.
డైమండ్ హార్బర్ నియోజకవర్గంలోని రాయ్నగర్ ప్రాథమిక పాఠశాల, బూత్ నం. 243 వద్ద ఒక ఓటరు ఫిర్యాదు చేశారు. ఈవీఎం (EVM) పనిచేయకపోవడంతో తాము అరగంటకు పైగా వేచి చూస్తున్నామని ఓటర్లు పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల రెండు దశలు బుధవారంనాడు ముగిశాయి. ఎన్నికల పర్యవేక్షక సంస్థ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎన్నికల్లో సుమారు 92 శాతంతో రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక ఓటింగ్ శాతం నమోదైంది.
6.81 కోట్ల మంది ఓటర్ల సంఖ్య కలిగిన బెంగాల్లో, ఏప్రిల్ 23న జరిగిన మొదటి దశ పోలింగ్లో 93 శాతం ఓటింగ్ నమోదవ్వగా, రెండవ దశలో 91 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. గతంలో, బెంగాల్లో అత్యధిక ఓటింగ్ శాతం 2011లో నమోదైంది. ఆ సమయంలో సుమారు 84 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.






