05-02-2026 12:00:00 AM
ఐదుగురికి తీవ్ర గాయాలు
ములుగు/మేడారం, ఫిబ్రవరి4,(విజయక్రాంతి): ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారం సమ్మక్కసారలమ్మ జాతర తిరుగువారం వెళ్తున్న భక్తులతో నిండిన వాహనం అదుపుతప్పి బోల్తా పడిన ఘటన ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీపంలో చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల ప్రాంతం నుంచి మేడారానికి భక్తులతో బయల్దేరిన వాహనం, తాడ్వాయి మండల కేంద్రాన్ని దాటి సుమారు రెండు కిలోమీటర్ల దూ రంలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద నియంత్రణ తప్పి రోడ్డుపక్కకు బోల్తా పడినట్లు స్థానికు లు తెలిపారు. ఈ ప్రమాదంలో ఐదుగురు భక్తులకు తీవ్ర గాయాలు కాగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటన సమాచారం అందుకున్న వెంటనే స్థానికులు మరియు పోలీసులు సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. మేడారం జాతర సందర్భంగా భారీగా వాహనాల రాకపోకలు కొనసాగుతున్న నేపథ్యంలో, ఆ ప్రాంతంలో మలుపులు ప్రమాదకరంగా మారుతున్నాయని, డ్రైవర్లు అత్యంత అప్రమత్తంగా వాహనాలు నడపాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు విచారణ చేపట్టారు.