మేడేను జయప్రదం చేయండి
మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో రానున్న ''మేడే' (అంతర్జాతీయ కార్మిక దినోత్సవం) సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వేడుకలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా మున్సిపల్ కార్మిక సంఘం కార్యదర్శి ఎండి ఉస్మాన్ పిలుపునిచ్చారు. మంగళవారం 141వ మేడే పోస్టర్ ను మున్సిపల్ కార్మికులతో కలసి విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఉస్మాన్ మాట్లాడుతూ 1886 మే 1న అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు 8 గంటల పని దినం కోసం చేసిన చారిత్రక పోరాటానికి గుర్తుగా మేడేను ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నాం అని తెలిపారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, సమాన వేతనం కోసం జరిగిన ఆ పోరాటం ప్రపంచ కార్మిక ఉద్యమానికి మార్గదర్శకంగా నిలిచిందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త కార్మిక చట్టాలు కార్మికుల హక్కులను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వాటివల్ల పని గంటలు పెరిగి కాంట్రాక్ట్ ఉద్యోగాలు పెరిగి శాశ్వత ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందినీ పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్ల హక్కులు పరిమితం అవుతున్నాయి.కార్మికులకు లభించే భద్రతా, సంక్షేమ ప్రయోజనాలు తగ్గే పరిస్థితి ఏర్పడుతోందన్నారు. ఇవి కార్మిక వర్గాన్ని బలహీనపరిచే చర్యలుగా వారు విమర్శించారు.






