మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లోని మార్కాపురం బస్సు ప్రమాద ఘటనపై కేంద్రమంత్రులు(Union Ministers) కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని బండి సంజయ్(Bandi Sanjay Kumar) అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని సూచించారు. ప్రమాదఘటనపై సమగ్ర దర్యాప్తు ఏపీ ప్రభుత్వాన్ని కోరారు.
"ఆంధ్రప్రదేశ్ మార్కాపురం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ప్రైవేట్ బస్సు, లారీ ఢీకొన్న ప్రమాదంలో ప్రయాణికులు సజీవ దహనం కావడం తీవ్రంగా కలచివేసింది. మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. మరణించినవారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ ఘటనలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని, బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను.'' అంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) ఎక్స్ లో పోస్టు చేశారు.
ఆంధ్రప్రదేశ్లోని రాయవరం గ్రామం సమీపంలో గురువారం ఉదయం టిప్పర్ లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సులో(Markapuram Bus Accident) మంటలు చెలరేగడంతో కనీసం 13 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. పలువురు గాయపడ్డారు. నివేదికల ప్రకారం, హైదరాబాద్ నుండి పామూరు వెళ్తున్న ఆ బస్సు, ఒక మలుపు వద్ద చీమకుర్తి వైపు నుండి వస్తున్న గ్రానైట్ లోడుతో కూడిన ట్రక్కును ఢీకొట్టింది. ఈ ఢీకొన్న ధాటికి మంటలు చెలరేగడంతో ప్రయాణికులు బస్సులోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదం ఉదయం సుమారు 6:30 గంటల సమయంలో జరిగినట్లు సమాచారం. స్థానికులు, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించారు.




