04-02-2026 07:40:37 PM
మండల అధ్యక్షులు బోడపట్ల శివాజీ గౌడ్
మణుగూరు,(విజయక్రాంతి): బీసీల రాజ్యాధికారమే టీఆర్పీ పార్టీ లక్ష్యమని, ఆ పార్టీ మండల అధ్యక్షులు బోడపట్ల శివాజీ గౌడ్ అన్నారు. ఉమ్మడి జిల్లాల ఇంచార్జ్ నర్సయ్య గౌడ్ జన్మదిన వేడుకలను పట్టణంలోని శ్రీ విద్యాభ్యాస్ పాఠశాలలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా శివాజీ గౌడ్ మాట్లాడుతూ... తెలంగాణ రాజ్యాధికార పార్టీ రెండన్నర కోట్ల జనాభా కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల పార్టీగా ఏర్పడిం దని తెలిపారు. సమన్యాయం, పేద ప్రజల సంక్షేమం, సమగ్రాభివృద్ధి ధ్యేయంగా పార్టీ పని చేస్తుందని పేర్కొన్నారు.
బీసీ డిక్లరేషన్ అమలు చేస్తామని నమ్మించి, బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మున్సిపల్ ఎన్నికలలో 17 శాతం లోపే బీసీ రిజర్వేషన్లు అమలు చేసి, బీసీలను మరోసారి మోసం చేశారని ఆరోపించారు. సర్పంచ్ ఎన్నికలలో జనరల్ స్థానాలను గెలుచుకున్న బీసీ అభ్యర్థుల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికలలో కూడా జనరల్ స్థానాలను గెలుచుకొని ప్రభుత్వానికి బుద్ధిచెప్పాలని పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో మహిళా నాయకురాలు రాజేశ్వరి,మధు, కొరివి నరసింహారావు, బుచ్చయ్య, నరేష్, వర్షిత్, సాయికుమార్ ప్రసాద్ పాల్గొన్నారు.