రాకపోకలను వెంటనే పునరుద్ధరించాలి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి, ఆగస్టు 4 (విజయక్రాంతి): రాకపోకలను వెంటనే పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువాన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం లింగంపల్లి కుర్దు గ్రామం వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న తాత్కాలిక వంతెన పునరుద్ధరణ పనులను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, వంతెన పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ శాఖ అధికారులను ఆదేశించారు. పనుల నిర్వహణలో నిర్లక్ష్యం చేయవద్దన్నారు. వంతెన మరమ్మతు పనులు పూర్తయ్యే వరకు గ్రామస్తుల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలన్నారు.
ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు సూపరింటెండెంట్, రాజేశ్ చంద్ర ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీఓ), తాసిల్దార్, పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖల అధికారులు పాల్గొన్నారు.






