మెదక్ జిల్లాలో యూరియా కొరత లేదు
- రైతులు యూరియా యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలి
- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, జూన్ 18 (విజయక్రాంతి): రైతులు యూరియా యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలని, జిల్లాలో యూరియా కొరత లేదని, ప్రస్తుతం 6300 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో కలదని రైతులు యూరియా విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ గురువారం ఒక ప్రకటన ద్వారా స్పష్టం చేశారు.
మెదక్ జిల్లాలో యూరియా సరఫరా విషయంపై కలెక్టర్ మాట్లాడుతూ యూరియా కోసం యాప్ రూపొందించడం జరిగిందని రైతులు ఇంటి వద్ద నుంచే యూరియాను బుక్ చేసుకుని సమయానికి అనుగుణంగా డీలర్స్ దగ్గరకు వెళ్లి అవసరానికి అనుగుణంగా యూరియా తీసుకువచ్చన్నారు.
యూరియా కోసం రైతులు భారీ క్యూ లైన్లు కట్టవలసిన అవసరం లేదని ప్రస్తుతం జిల్లాలో ప్రైవేట్ డీలర్స్, మార్క్ ఫెడ్ లో 6,300 మెట్రిక్ టన్నుల యూరియా బఫర్ స్టార్ట్ కలదనీ ప్రతి మండలంలో రెండు మూడు డీలర్ పాయింట్లు వద్ద యూరియా స్టాక్ అందుబాటులో ఉంచుతున్నాం అని వివరించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా రైతు సేవ కేంద్రాలను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ రంగ అభివృద్ధిలో రైతు సేవా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, రైతులకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా వ్యవసాయ ఉత్పాదకత పెంపునకు తోడ్పడాలని కలెక్టర్ సూచించారు.






