10 March, 2026 | 5:24 AM

మూడో షెడ్యూల్ ముగించారు!

10-03-2026 12:00 AM

“నా కెరీర్‌లో కుమారి 21ఎఫ్’, ‘ఈడో రకం ఆడో రకం’, ‘ఓదెల రైల్వేస్టేషన్’ వంటి ఎన్నో బ్లాక్‌బస్టర్స్ ఉన్నప్పటికీ.. తాజాగా నేను చేస్తున్న ‘మిరాకిల్’ నా కెరీర్‌లో మోస్ట్ మెమరబుల్ మూవీ అవుతుంది. థాంక్స్ టు డైరెక్టర్ ప్రభాస్ నిమ్మల” అంటోంది క్రేజీ బ్యూటీ హెబ్బా పటేల్. సైదా ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రమేశ్ ఎగ్గిడి, శ్రీకాంత్ మొగ దాసు, చందర్ గౌడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న కొత్త సినిమానే ‘మిరాకిల్’.

ఇందులో హెబ్బా పటేల్ హీరోయిన్. రణధీర్ బీసు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ హీరోలు సురేశ్, శ్రీరామ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ‘సత్య గ్యాంగ్’, ‘ఫైటర్ శివ’ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవల హైదరాబాద్ పరిసరాల్లోని కొండమడుగు గ్రామంలో ప్రారంభించిన మూడో షెడ్యూల్ తాజాగా పూర్తయింది.

ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో హీరోయిన్లు నవ్యశ్రీ, అక్షర, నటులు ధీరజ అప్పాజీ, నరేశ్ నాయుడు, డీవోపీ సురేందర్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్, చిత్రబృందం పాల్గొన్నారు. సీనియర్ హీరో శ్రీరామ్ మాట్లాడుతూ.. “మిరాకిల్‘ వంటి మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ పెద్ద హిట్ చేస్తారు” అన్నారు.

‘ప్రతి ఒక్కరూ తమ సొంత సినిమాలా భావించి, అంకితభావం చూపుతుండడం నన్ను చాలా భావోద్వేగానికి లోనుచేస్తోంది. కొండమడుగు వాసుల ప్రేమాభిమానాలు మా యూనిట్ ఎప్పటికీ మర్చిపోదు. ఈ గ్రామంలో సక్సెస్ మీట్ చేస్తాం’ అని దర్శకుడు ప్రభాస్ నిమ్మల చెప్పారు. ‘ఈ మూడో షెడ్యూల్‌తో దాదాపు 90 శాతం షూటింగ్ పూర్తయ్యింది. చివరి షెడ్యూల్ త్వరలో ప్లాన్ చేస్తాం’ అని ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ శ్రీకాంత్ తెలిపారు.