10 March, 2026 | 3:42 AM

నడిమిట్ల కలిసేర ప్రేమల సుకుమారి..

10-03-2026 12:00 AM

‘బేబి’ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్‌ను తమ ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ జంట ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య. ఆ సినిమా తర్వాత మళ్లీ ఈ జోడీ కలిసి మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ చిత్రమే ‘ఎపిక్ ఫస్ట్ సెమిస్టర్’. ‘90స్’ వెబ్‌సిరీస్ ఫేమ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సితార ఎంటర్‌టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు.

మేకర్స్ తాజాగా ఈ చిత్రం నుంచి తొలిగీతంగా ‘సంచారమే’ను చేశారు. ప్రఖ్యాత గీత రచయిత గోరేటి వెంకన్న రచించిన ఈ గీతానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతాన్ని సమకూర్చారు. ఈ పాటను సైతం హేషమ్ అబ్దుల్ వహాబ్, గోరేటి వెంకన్న కలిసి ఆలపించారు. ‘సంచారమే ఎంతో బాగున్నది.. దీనంత ఆనందమేమున్నది..

ఊరునిడిసి గాలిమోటారెక్కినాది.. మోటు మనుషులనిడిసి.. స్వీటు మనుషులజేరి.. మనసు నమ్ముకుంది.. వెంకటేశ్వర సామి.. నడిమిట్ల కలిసేర ప్రేమల సుకుమారి’.. అంటూ సాగుతోంది. దేశీ మూలాలు, విదేశీ జీవితానికి మధ్య ఉన్న విరుద్ధ భావాలను సున్నితంగా ప్రతిబింబిస్తోందీ గీతం.  ఈ చిత్రానికి డీవోపీ: అజీమ్ మహమ్మద్; కూర్పు: నవీన్ నూలి.