స్త్రీ నిధి రుణాల రికవరీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలి
కలెక్టర్ ప్రతిమాసింగ్
మెదక్, జూలై 27(విజయ క్రాంతి) : జిల్లాలో స్త్రీ నిధి రుణాల రికవరీని యుద్ధ ప్రాతిపదికన చేపట్టి, వచ్చే రెండు నెలల్లో కనీసం 90 శాతం రికవరీ సాధించేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించి అమలు చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి స్త్రీ నిధి సమీక్ష కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు , అడిషనల్ డిఆర్డిఓ సరస్వతి , మెప్మా పిడి. హనుమంత రెడ్డి తో కలిసి జిల్లాలో స్త్రీ నిధి రుణాల రికవరీ, పెండింగ్ బకాయిలు, మండలాల వారీ పురోగతి, భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
రికవరీ శాతం తక్కువగా ఉన్న మండలాలు ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులను నేరుగా ప్రశ్నించిన కలెక్టర్ వెనుకబడిన కారణాలను విశ్లేషించి ఆయా మండలాలకు ప్రత్యేక యాక్షన్ ప్లాన్ రూపొందించి క్షేత్రస్థాయిలో అమలు చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో స్త్రీ నిధి రికవరీలో జిల్లా 46 స్థానంలో ఉందన్నారు.
స్త్రీ నిధి జోనల్ మేనేజర్ టీ వీ రవికుమార్ మాట్లాడుతూ మండలాల వారీగా ప్రత్యేక రికవరీ ప్రణాళికలు రూపొందించి, వీవోలు, ఏపీఎంలు, మండల సమాఖ్యలు సమన్వయంతో పనిచేయాలని, బకాయిలు ఉన్న మహిళా సంఘాల సభ్యులకు అవగాహన కల్పించి అవసరమైతే ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని సూచించారు. సకాలం లో రుణాలు చెల్లించే సంఘాలను ప్రోత్సహించడంతో పాటు, రికవరీలో వెనుకబడిన మండ లాలపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని తెలిపారు. అడిషనల్ డిఆర్డిఓ సరస్వతి శ్రీనిధి రీజనల్ మేనేజర్ గంగారం, ఏపీఎంలు, మండల సమాఖ్య అధ్యక్షులు, వీవోలు. పాల్గొన్నారు






