29 May, 2026 | 4:41 AM

మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని సరి చేయాలి

29-05-2026 12:05 AM

అన్యాయంపై హరీష్ రావుకు వినతి

తెలంగాణ మాల సంఘాల జేఏసీ

ముషీరాబాద్, మే 28 (విజయక్రాంతి): తెలంగాణలో మాల సమాజానికి రోస్టర్ విధానం, ఎస్సీ వర్గీకరణ వల్ల జరుగుతున్న అన్యాయాన్ని సరిచేయాలని తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ మందాల భాస్కర్, గౌరవ చైర్మన్ చెరుకు రామచందర్, గ్రేటర్ హైదరాబాద్ మాల సంఘాల జేఏసీ చైర్మన్ బేర బాలకిషన్ (బాలన్న), తెలంగాణ మాల విద్యార్థి జేఏసీ చైర్మన్ మాదాసు రాహుల్ రావులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు గురువారం వర్గీకరణ విషయంలో  మాలలకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ న్యాయం చేయాలని కోరుతూ  తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ నాయకులు గురువారం మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును కలిసి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, చెరుకు రామచందర్, బేర బాలకిషన్, మాదాసు రాహుల్ రావులు మాట్లాడుతూ మాల నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యార్థులకు న్యాయం జరిగేలా రోస్టర్ విధానాన్ని సవరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ’మాల కార్పొరేషన్’ ఏర్పాటు చేసి, ఎస్సీలలోని 59 కులాలకు సమాన న్యాయం జరిగేలా ఎస్సీ వర్గీకరణ సవరణ చట్టాన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని కోరారు. తెలంగాణ వ్యాప్తంగా మాల సమాజాన్ని చైతన్యపరుస్తూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాల మాల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.