10-02-2026 12:00:00 AM
జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి. పాటిల్
భద్రాద్రి కొత్తగూడెం, ఫిబ్రవరి 9, (విజయక్రాంతి): మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల లెక్కింపు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు మైక్రో అబ్జర్వర్లు, ఆర్వోలు, ఏఆర్వోలు, కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లకు ఐడీఓసీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా, అత్యంత పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ సమయంలో ప్రతి దశలో అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పొరపాట్లకు అవకాశం లేకుండా పరస్పర సమన్వయంతో విధులు నిర్వర్తించాలని తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు చేస్తూ, చిన్న తప్పిదానికైనా అవకాశం లేకుండా విధులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్ సూపర్వైజర్లు ఎన్నికల ప్రక్రియపై పూర్తి అవగాహన కలిగి, తమ బాధ్యతలను అత్యంత జాగ్రత్తగా, సమర్థవంతంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో, చట్టబద్ధంగా, సమర్థవంతంగా జరిగేలా చూడాల్సిన బాధ్యత కౌంటింగ్ సిబ్బందిపై ఉందని తెలిపారు.
ఎన్నికల కమిషన్ జారీ చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటిస్తూ, తమ విధులను నిబద్ధతతో, బాధ్యతాయుతంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన ,ఎన్నికల శిక్షణ నోడల్ అధికారి శ్రీరామ్, సంబంధిత కౌంటింగ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.