విద్యార్థులు విద్యతోపాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి
- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- టెన్త్, ఇంటర్లో రాణించిన విద్యార్థులకు ప్రశంసా పత్రాల అందజేత
ముషీరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): విద్యార్థులు చదువుతోపాటు క్రమ శిక్షణతో మెలుగుతూ తమ భవిష్యత్ కు బంగారు బాటలు వేసుకోవాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ సూచించారు. ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో శిల్పా ఆరట్స్ క్రియేషన్స్ 30 వ వార్షికోత్సవ సందర్భంగా ముఖ్య అతిథిగా బండారు దత్తాత్రేయ హాజరై ఇంటర్, ఎస్ఎస్సీ లో అత్యధిక మార్కులు సాధించిన 70 విద్యార్థులకు కాలేజ్ బ్యాగులు, మేమొంటోలు, ప్రశంసా పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా, దత్తాత్రేయ మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా శిల్పా ఆరట్స్ క్రియేషన్స్ అధ్యక్షుడు ప్రకాష్ చేస్తున్న సేవలను అభినందించారు. నేటి పోటీ ప్రపంచంలో నిలదొక్కుకోవాలంటే మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్య అభివృద్ధిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు మాజీ గవర్నర్ సూచించారు. ఈ సందర్భంగా యాదగిరి గుట్ట ఆలయ కమిటీ మెంబెర్ గా నియమితులైన ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త గుండా మల్లయ్య ను శాలువతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ఎంఎల్సీ బొగ్గరపు దయానంద్, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత, ప్రముఖ పారిశ్రామిక వేత్త తెగుళ్ల వీరా స్వామి,గంగాధర్, శిల్పా ఆరట్స్ భాగ్యలక్ష్మి,ప్రధాన కార్యదర్శి ఆర్ పద్మ ప్రియ,ఆర్గనైజింగ్ సెక్రటరీ కే.రాములు, నిరీషా,మహాత్మా గాంధీ ఫౌండర్ సౌమ్య శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.






