8 August, 2026 | 1:14 AM

ఆరేళ్ల నిరీక్షణకు తెర..!

08-08-2026 12:00 AM

మళ్లీ విద్యుత్ ఉత్పత్తికి శ్రీశైలం 4వ యూనిట్

2020 అగ్నిప్రమాదంతో నిలిచిన యూనిట్ పునరుద్ధరణ పూర్తి 

ఈ నెల 10న ప్రారంభానికి ఏర్పాట్లు

రూ.25 కోట్లతో కీలక మరమ్మతులు 

రాష్ట్ర విద్యుత్ రంగానికి ఊరట

అచ్చంపేట, ఆగస్టు 7 (విజయక్రాంతి): ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించి నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి 4వ యూనిట్ ఆరేళ్ల తర్వాత పునరుద్ధరణ అనంతరం ఈ నెల 10న తిరిగి ప్రారంభం కానుంది. శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రం 4వ విద్యుత్ ఉత్పత్తి యూనిట్ మళ్లీ ప్రాణం పోసుకోనుంది. 2020 ఆగస్టు 20న సంభవించిన ఘోర అగ్నిప్రమాదంతో పూర్తిగా పనిచేయకుండా నిలిచిపోయిన ఈ యూనిట్ను పునరుద్ధరించేందుకు చేపట్టిన దీర్ఘకాలిక మరమ్మతులు, సాంకేతిక పరీక్షలు విజయ వంతంగా పూర్తికావడంతో ఈ నెల 10న తిరిగి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించేందుకు జెన్కో అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.

యూనిట్ పునఃప్రారంభం రాష్ట్ర విద్యుత్ వ్యవస్థకు కీలక మైలురాయిగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. రాష్ట్రాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిన అగ్నిప్రమాదం. 2020 ఆగస్టు 20న శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జలవిద్యుత్ కేంద్రంలో ఒక్కసారిగా సంభవించిన అగ్నిప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రమాద సమయంలో విధుల్లో ఉన్న  పలువురు ఇంజినీర్లు, ఉద్యోగులు పొగతో నిండిపోయిన భూగర్భ కేంద్రంలో చిక్కుకుని 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన విద్యుత్ శాఖ చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనల్లో ఒకటిగా నిలిచింది.

ప్రమాదం కారణంగా విద్యుత్ కేంద్రానికి రూ.100 కోట్లకు పైగా నష్టం వాటిల్లగా, ఉత్పత్తి కార్యకలాపాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తిరిగి అందుబాటులోకి తీసుకు రావడం కోసం పలు దశల్లో మరమ్మతులు చేపట్టారు. దెబ్బతిన్న యంత్రాలు, విద్యుత్ నియంత్రణ వ్యవస్థలు, కేబుల్ నెట్వర్క్, రక్షణ పరికరాలను పూర్తిగా పునర్నిర్మించాల్సి వచ్చింది. 2023లో ఒకసారి, 2025లో మరోసారి మరమ్మతులు పూర్తి చేసినప్పటికీ సాంకేతిక సమస్యలు పూర్తిగా పరిష్కారం కాకపోవడంతో యూనిట్ ప్రారంభాన్ని పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది.

దీంతో విద్యుత్ ఉత్పత్తి పునఃప్రారంభంపై అనిశ్చితి నెలకొంది. అనంతరం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపడంతో తాజాగా ఢిల్లీకి చెందిన వాయిత్ కంపెనీ ఆధ్వర్యంలో సుమారు రూ.25 కోట్ల వ్యయంతో కీలక యాంత్రిక, విద్యుత్ పరికరాల మరమ్మతులు చేపట్టారు. ట్బన్, జనరేటర్, కంట్రోల్ సిస్టమ్, రక్షణ పరికరాలతో పాటు ఇతర కీలక భాగాలను ఆధునిక సాంకేతిక ప్రమాణాలకు అనుగుణంగా పునరుద్ధరించారు. అనంతరం నిర్వహించిన లోడ్ టెస్టులు, భద్రతా పరీక్షలు, సమన్వయ పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి.

విద్యుత్ ఉత్పత్తి ప్రారంభానికి చర్యలు 

ప్రస్తుతం యూనిట్ను రాష్ట్ర విద్యుత్ గ్రిడ్కు అనుసంధానించే తుది ప్రక్రియ కొనసాగుతోంది. అవసరమైన అన్ని సాంకేతిక పరీక్షలు పూర్తికావడంతో ప్రారంభానికి సంబంధించిన తుది ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 10న యూనిట్ను అధికారికంగా ప్రారంభించి విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు జెన్కో సూపరింటెండింగ్ ఇంజనీర్ ఆదినారాయణ తెలిపారు. ఈ యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం మరింత పెరగనుంది. అన్ని సాంకేతిక ప్రమాణాలు సంతృప్తికరంగా ఉండడంతో యూనిట్ దీర్ఘకాలం సజావుగా పనిచేస్తుందనే విశ్వాసాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఆరేళ్ల నిరీక్షణ అనంతరం శ్రీశైలం 4వ యూనిట్ మళ్లీ విద్యుత్ ఉత్పత్తిలోకి రావడం తెలంగాణ విద్యుత్ రంగానికి కీలక పరిణామంగా నిలవనుంది.