బుయ్యారం గ్రామంలో గుడుంబా స్థావరాలపై ప్రత్యేక దాడులు
- అక్రమ గుడుంబా తయారీ నిర్మూలనకు పోలీసుల కట్టుదిట్టమైన చర్యలు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): రామగుండం పోలీస్ కమీషనరేట్, మంచిర్యాల జోన్ పరిధిలోని నీల్వాయి పోలీస్ స్టేషన్ ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ ఆధ్వర్యంలో ఎక్సైజ్ శాఖ సిబ్బంది కలిపి 40 మంది కలిసి బుయ్యారం గ్రామంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 20 గుడుంబా తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు నిర్వహించి, సుమారు 5,000 లీటర్ల పులియబెట్టిన బెల్లం మిశ్రమం (గుడుంబా పానకం)ను ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా సీఐ కృష్ణ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ... అక్రమంగా గుడుంబా తయారీ, విక్రయాలు చట్ట విరుద్ధమన్నారు. గుడుంబా తయారీలో ఎవరైనా పాల్గొంటే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ దాడుల్లో చెన్నూరు రూరల్ సీఐ కృష్ణ,ఎస్ఐ జగదీశ్వర్ రెడ్డి, చెన్నూరు ఎక్సైజ్ సిఐ హరి, మంచిర్యాల డీటీఫ్ సీఐ సమ్మయ్య, చెన్నూరు ఎక్సైజ్ ఎస్సై రమణ, బెల్లంపల్లి ఎక్సైజ్ ఎస్సై శారద, సిబ్బంది పాల్గొన్నారు.




