25 February, 2026 | 10:24 PM

ప్రకృతి సమతుల్యత సర్వేను పక్కగా నిర్వహించారు

25-02-2026 06:38 PM

 జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్,(విజయక్రాంతి): ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో చిత్తడి నేలలు(వెట్ ల్యాండ్స్) అత్యంత కీలకపాత్ర పోషిస్తాయని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో చిత్తడి నేలల గుర్తింపు, సంరక్షణపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో ఉన్న చిత్తడి నేలలను శాస్త్రీయంగా గుర్తించి, వాటిని అభివృద్ధి పరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఈ ప్రక్రియలో భాగంగా అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో వ్యవహరించి, సంయుక్తంగా క్షేత్రస్థాయి సర్వేలు నిర్వహించాలని సూచించారు. చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవ వైవిధ్యం పెంపొందుతుందని, వీటిని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జిల్లా అటవీ శాఖాధికారి (డిఎఫ్ఓ) సుశాంత్ సుఖదేవ్ బోబడే, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విజయలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, జెడ్పీ సీఈవో శంకర్, జిల్లా పరిశ్రమల మేనేజర్ నరసింహ రెడ్డి, మత్స్య శాఖ ఏడి రాజ నర్సయ్య, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.