15 May, 2026 | 3:05 AM

సమగ్రాభివృద్ధికి ప్రత్యేక దృష్టి

15-05-2026 01:35 AM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రం భీం ఆసిఫాబాద్, మే14 (విజయక్రాంతి): ఆసిఫాబాద్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని కొట్నాక భీంరావు చిల్డ్రన్స్ పార్క్లో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్, మున్సిపల్ చైర్మన్ మంగ్రే ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్, మున్సిపల్ కమిషనర్ తిరుపతి తో కలిసి రూ.1.20 కోట్ల నిధులతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు అవసరమైన అభివృద్ధి పనులను దశలవారీగా చేపడుతూ ఆసిఫాబాద్ను మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్తామని తెలిపారు. షాపింగ్ కాంప్లెక్స్ ద్వారా వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు, షాదీఖానా, స్మశాన వాటిక ద్వారా ప్రజలకు అవసరమైన వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. పిల్లల కోసం చిల్డ్రన్స్ పార్క్ను ఆకర్షణీయంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వెంకన్న, సలాం, అబ్దుల్లా, కార్తీక్, వినోద్, గోవింద్, భారతి, స్వప్న రాణి, తారాబాయి, లక్ష్మి, కమలమ్మ, నాయకులు గంధం శ్రీనివాస్, ఫయాజ్, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.