2 September, 2026 | 8:54 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

కర్షకుల కష్టాలు తీర్చేందుకు సతీపతుల విశిష్ట కృషి

15-05-2026 | 01:36am

తోడునీడగా నిలిచిన కలెక్టర్ ఎస్పీ దంపతులు

మహబూబాబాద్, మే 14 (విజయక్రాంతి): అన్నదాతల ఆవేదనను అర్థం చేసుకుని, రైతు కుటుంబాల్లో భరోసా నింపేందుకు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, ఎస్పీ డాక్టర్ శబరిష్ దంపతులు చేస్తున్న సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అధికార హోదాలను ప్రజాసేవకు అంకితం చేస్తూ, కర్షకుల కష్టాలను కడ తీర్చేందుకు ఆ దంపతులు తోడునీడగా నిలుస్తున్న సతీపతులు మహబూబాబాద్ జిల్లా రైతుల మనసుల్లో ప్రత్యేక స్థానం అందుకుంటున్నారు.

జిల్లావ్యాప్తంగా నెలకొన్న ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లలో ఏర్పడ్డ ప్రతిష్టంబన తొలగించడానికి కార్యరంగంలోకి దిగారు. కొనుగోలు కేంద్రాలకు వెళ్లి నేరుగా రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటూ, వెంటనే పరిష్కార చర్యలు చేపడుతున్నారు. ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్ల వేగవంతనికి అటు కలెక్టర్ స్నేహ శబరిష్, ఇటు ఎస్పీ డాక్టర్ శబరీష్ అధికార, పోలీస్ శాఖల సమన్వయంతో ముందుకు సాగుతున్నారు.

గురువారం జిల్లాలోని నెల్లికుదురు మండలంలో కలెక్టర్, ఎస్పీ దంపతులు కలిసి ధాన్యం, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. వేగంగా కొనుగోలు నిర్వహించడానికి అవసరమైన చర్యలను సూచించారు. ధాన్యం రవాణా, అన్లోడింగ్, గోదాముల వద్ద ఇబ్బందులు తలెత్తకుండా, శాంతి భద్రతల పరిరక్షణ, తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. అలాగే రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన చర్యలను చేపట్టారు.

ఎక్కడ కూడా ఎలాంటి అక్రమాలు, మధ్యవర్తుల జోక్యం లేకుండా రైతులు నేరుగా తమ ధాన్యం మొక్కజొన్న పంట ఉత్పత్తులను విక్రయించడానికి వేగవంతమైన చర్యలు చేపట్టారు. జిల్లా సారధులైన కలెక్టర్, ఎస్పీ దంపతులు రైతుల సంక్షేమానికి చేస్తున్న కృషిని పలువురు అభినందిస్తున్నారు.