17 August, 2026 | 9:38 PM

బాన్సువాడ నియోజకవర్గంలో SIR 89.87 శాతం పూర్తి

17-08-2026 08:52 PM

డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల.. 19,887 ఓట్లు తొలగింపు

ప్రస్తుతం 1,76,449 మంది ఓటర్లు...

అక్టోబర్ 19న తుది జాబితా విడుదల...

ఆర్డీవో రవీందర్ రెడ్డి వెల్లడి...

బాన్సువాడ, ఆగస్టు 17 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం (ఎస్ఐఆర్) 89.87 శాతం పూర్తయినట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ముసాయిదా జాబితాపై సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ ప్రక్రియకు ముందు నియోజకవర్గంలో మొత్తం 1,96,331 మంది ఓటర్లు ఉండగా, పరిశీలన అనంతరం 19,887 ఓట్లను తొలగించినట్లు ఆర్డీఓ తెలిపారు.

వీటిలో 3,962 మంది మృతి చెందినవారు, 9,878 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారు, 5,157 డబుల్ ఎంట్రీలు, 863 మంది ఎస్ఐఆర్ ప్రక్రియను పూర్తి చేయనివారు ఉన్నట్లు వెల్లడించారు. మరో 43 మంది పేర్లు నమోదు చేయాల్సి ఉందన్నారు.ఎస్ఐఆర్ అనంతరం ప్రస్తుతం నియోజకవర్గంలో 1,76,449 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. నియోజకవర్గ వ్యాప్తంగా 235 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.ఓటర్ల ముసాయిదా జాబితాను సోమవారం విడుదల చేసి, అన్ని మండల కేంద్రాల్లో జాబితాలను ప్రదర్శిస్తున్నట్లు ఆర్డీఓ తెలిపారు.

ఓటర్ల పేర్లు, వివరాల్లో తప్పులు ఉన్నా లేదా ఏవైనా అభ్యంతరాలు ఉన్నా సంబంధిత బిఎల్వో లేదా తహసీల్దార్ కార్యాలయంలో తెలియజేయాలని సూచించారు.కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, పేర్ల మార్పులు, ఇతర దిద్దుబాట్ల కోసం ఫామ్‌–6, 7, 8 దరఖాస్తులను సోమవారం నుంచి స్వీకరిస్తున్నట్లు తెలిపారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు డిక్లరేషన్ ఫారంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అక్టోబర్‌ 19న తుది జాబితా

ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా బిఎల్వో లు ఇంటింటి సందర్శనలు జూన్‌ 25 నుంచి ఆగస్టు 10 వరకు నిర్వహించారని తెలిపారు. ఆగస్టు 10న పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ పూర్తయిందన్నారు. ఆగస్టు 17న డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా ప్రచురించగా, ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్‌ 16 వరకు క్లెయిమ్స్, అభ్యంతరాలు స్వీకరిస్తారు. వాటిపై విచారణ, పరిష్కార ప్రక్రియ అక్టోబర్‌ 15 వరకు కొనసాగనుంది. అక్టోబర్‌ 19న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు.

ఎస్ఐఆర్ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యేందుకు అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించారని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ నరేందర్ గౌడ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు, కాంగ్రెస్ యువ నేత కాసుల రోహిత్, మాసాని రవీందర్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి, బీఆర్ఎస్ నేత రమేష్ యాదవ్, టీడీపీ నేత శంషాద్దిన్, ఎంఐఎం నేత హశిం, ఆర్ఐ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.