14 May, 2026 | 11:09 AM

హమాలీల కొరతను భర్తీ చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్.

14-05-2026 09:46 AM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): కొనుగోలు కేంద్రాల్లో హమాలీల కొరత లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. పట్టణంలోని నెల్లికొండ మార్కెట్ యార్డులో మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియను జిల్లా ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ తో కలిసి పరిశీలించిన సందర్భంగా అక్కడ పనిచేస్తున్న కార్మికులతో కలెక్టర్ మాట్లాడారు. అవసరమైన మేరకు మరింత మంది హమాలీలను రప్పించి లోడింగ్, అన్‌లోడింగ్ పనులు అంతరాయం లేకుండా కొనసాగించేలా చూడాలని సూచించారు.

రోజుకు ఎన్ని లారీల్లో సరుకు రవాణా జరుగుతోందో, కూలీలకు రోజువారీ చెల్లింపులు సక్రమంగా అందుతున్నాయా అనే అంశాలను కూడా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. రైతులు ఇబ్బందులు పడకుండా హమాలి, రవాణా సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. వారి వెంట అదనపు కలెక్టర్ అమరేందర్, మార్క్‌ఫెడ్ డీఎం తమీన, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ రమణారావు తదితరులు పాల్గొన్నారు.