ఆర్టీసీ ‘గ్రీన్’కబుర్లు!
- పైకి పచ్చదనం.. లోపల కాలుష్యం
- ‘ఈవీ’లను ప్రోత్సహిస్తూనే డీజిల్ బస్సుల కొనుగోలు
- మహిళా సంఘాల పేరిట రోడ్డెక్కిన 553 డీజిల్ సర్వీసులు
- ఆర్టీసీ ద్వంద్వ వైఖరిపై విమర్శలు
- మహిళా సంఘాలకూ ఈవీ బస్సులనే ఇవ్వాలి
- పర్యావరణ వేత్తల డిమాండ్
హైదరాబాద్, జూన్ 2౩ (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ విష యంలో ఆర్టీసీ రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందనే విమర్శ లు వినిపిస్తున్నాయి. ఒక వైపు కాలు ష్య నియంత్రణకు ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ప్రకటనలు చేస్తూనే.. మరోవైపు మహిళా సంఘాలకు పెద్ద సంఖ్యలో డీజిల్ బస్సులను కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.
వాయు కాలుష్యాన్ని తగ్గించేందు కు టీజీఎస్ఆర్టీసీ భారీగా ఎలక్ట్రిక్ బస్సులను (ఈవీ) ప్రవేశపెడుతోంది. రాష్ట్రంలో ఇప్పటికే సుమారు 1,050 ఎలక్ట్రిక్ బస్సులను(ఈవీ) నడుపుతోంది. త్వరలో మరో 2వేల ఈవీ బస్సు లు రానున్నాయి. మొత్తంగా 5 వేల ఈవీ బస్సులు దశలవారీగా రోడ్డెక్కనున్నాయి.
కొనుగోలు చేసినవన్నీ డీజిల్ బస్సులే..
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా స్వయం సహాయక మహిళా సంఘాలకు బా్ంయకు రుణాలు అందించి, బస్సుల కొనుగోలుకు శ్రీకారం చుట్టింది. వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తోంది.
ఇందులో భాగంగా ఇటీవల 553 కొత్త బస్సులను మహిళా సంఘాలకు అప్పగించింది. అయితే, ఇవన్నీ డీజిల్ బస్సులు కావ డం గమనార్హం. పర్యావరణ హితం గురించి గొప్పలు చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం.. డీజిల్ బస్సులను ఎందుకు ప్రోత్సహిస్తోందని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
స్వలాభం కోసమేనా?
పర్యావరణ హితం కోసం ఈవీ బస్సులను ఆర్టీసీ కార్మికులతో సహా అందరూ స్వాగతిస్తున్నారు. అయితే ఈవీ బస్సులను ప్రైవేట్, కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి, డీజిల్ బస్సులను మహిళా సంఘాలకు అప్పగించడంపై అనుమా నాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీ బస్సులపై కేంద్రం నుంచి వచ్చే రూ. 36 లక్షల (ఒక్కో బస్సుకు) గ్రాంట్ను ప్రైవేటు కంపెనీలకు అప్పగిస్తూ, పర్యావరణానికి హాని కలిగించే డీజిల్ బస్సులను మహిళా సంఘాలకు అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వలాభం కోసం ఈవీ బస్సుల విషయంలో ప్రైవేట్, కార్పొరేట్ కంపెనీలకు రాష్ట్రం అనుకూలంగా వ్యవహరిస్తుందనే ఆరోపణలున్నాయి. ఈవీ, డీజిల్ బస్సులను కూడా ఆర్టీసీ అద్దెకు తీసుకోవడం గమనార్హం. స్వయం సహాయక సంఘాలకు కూడా ఈవీ బస్సులను ఇస్తే పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.






