ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ
బేల,(విజయక్రాంతి): అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) రాష్ట్ర శాఖ పిలుపు మేరకు "ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం"అనే నినాదంతో మంగళవారం బేలా మండల కేంద్రంలో విద్యా బంద్ నిర్వహించారు.ఈ సందర్భంగా తెరిచి ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి బంద్కు సహకరించేలా చేయగా, ప్రైవేట్ పాఠశాలలు ముందస్తుగా విద్యాసంస్థలను మూసివేశాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ నేత మాడవార్ హరీష్ రెడ్డి మాట్లాడుతూ.... రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ముఖ్యమంత్రి 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేల పాఠశాలలను మూసివేస్తామని చేసిన ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని కోరారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో 25 శాతం సీట్లను పేద విద్యార్థులకు కేటాయించే నిబంధనను పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. ఖాళీగా ఉన్న ఎంఈవో, డీఈవో పోస్టులతో పాటు టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, విద్యార్థులకు అందించాల్సిన యూనిఫాంలను వెంటనే పంపిణీ చేయాలని కోరారు.
గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి, ఫుడ్ పాయిజన్ ఘటనలకు తావులేకుండా నాణ్యమైన భోజనం అందించాలని అన్నారు.అలాగే జాతీయ విద్యా విధానం (NEP-2020)ను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తక్షణమే అమలు చేయాలని కోరారు.ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాల ఆధ్వర్యంలో జరుగుతున్న పుస్తకాలు,యూనిఫాంల విక్రయాలను నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏబీవీపీ చేపట్టిన విద్యా బంద్కు విద్యార్థులు,తల్లిదండ్రులు, ప్రజలు సహకరించాలని నాయకులు విజ్ఞప్తి చేశారు.వారి వెంట ఏబీవీపీ నాయకులు అజయ్,సచిన్,తరుణ్, యోగేష్, కట్కార్ల సాయి రెడ్డి, మహేష్,శివ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.






