23-02-2026 12:00:00 AM
తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్
ముషీరాబాద్, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్లో బీసీల అభివృద్ధికి, వివిధ పథకాల కోసం రూ.25 వేల కోట్లు కేటాయించాలని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే బీసీ కార్పొరేషన్ కు రూ.5 వేల కోట్లు, 21 బీసి కులాల కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు జనాభా నిష్పత్తి ప్రకారం రూ.8 వేల కోట్లు కేటాయించాలని కోరారు. బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం ఆదివారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బీసి సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిధిగా హాజరైన ఎంపీ ఆర్. కృష్ణ య్య మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం ప్రకారం కామారెడ్డి డిక్లరేషన్లో ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ప్రకటించారని, కానీ గత రెండేళ్లుగా కేవలం10 వేల కోట్లు మాత్రమే కేటాయించారని అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానం ప్రకారం విద్యార్థుల పూర్తి ఫీజులు చెల్లించాలని కోరారు. అలాగే ఫీజుల బకాయిలు రూ.8500 కోట్లు వెంటనే చెల్లించా లని డిమాండ్ చేశారు.
ఫీజులు రాక కొన్ని కాలేజీలు మూత పడ్డాయన్నారు. బీసీ కార్పొరేషన్ 21 బీసి కుల ఫెడరేషన్ల ద్వారా ప్రతి కుటుంబానికి రూ.20 లక్షల సబ్సిడీ రుణం మంజూరు చేయాలని కోరారు. ఇందుకోసం 13 వేల కోట్లు కేటాయించాలని కోరారు. బీసి కాలేజీ హాస్టళ్ళకు, గురుకులాలకు స్వంత భవనాలు నిర్మించాలన్నారు. అదనంగా 150 బీసి కాలేజీ హాస్టళ్ళు, 100 బీసి గురుకుల పాఠశాలలు మంజూరు చేయాలన్నారు.
విదేశీ విద్యాకు వెళ్ళే బీసి విద్యార్ధులందరికి స్టైఫండ్ ఇవ్వాలన్నారు. ఈ సమావేశంలో సంఘం నేతలు సతీష్, అనంతయ్య, శివకుమార్ యాదవ్, రాజేందర్, నిఖిల్, చంద్రశేఖర్ గౌడ్, అనురాధమ్మ గౌడ్, పద్మ గౌడ్, భీమ్ రాజ్, మొగిలి కృష్ణయ్య, మారపాక సతీష్, నరేష్ గౌడ్, చిక్కుడు బాలయ్య పాల్గొన్నారు.