రాష్ట్ర స్థాయి కరాటే పోటీల్లో రత్నాపూర్ విద్యార్థుల సత్తా
మల్లాపూర్,(విజయక్రాంతి): జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఎల్.ఎల్ గార్డెన్స్లో జూన్ ఏడున నిర్వహించిన ఫునాకోషి శోటోకాన్ స్టేట్ లెవెల్ ఓపెన్ కరాటే ఛాంపియన్షిప్ - 2026లో మల్లాపూర్ మండలంలోని రాత్నాపూర్ గ్రామానికి చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో రాత్నాపూర్ గ్రామం నుంచి పాల్గొన్న ఆరుగురు విద్యార్థులు అత్యుత్తమ ప్రదర్శనతో బంగారు పతకాలను కైవసం చేసుకొని గ్రామానికి గర్వకారణంగా నిలిచారు.
బంగారు పతకాలు సాధించిన విద్యార్థుల్లో ప్రణవి, లక్ష్మిత, మహాలక్ష్మి, ఆద్య, వర్షిత, రీయంశ ఉన్నారు. వీరి విజయం పట్ల గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా రాత్నాపూర్ గ్రామ సర్పంచ్ గొండ రాజేంద్ర విజేతలను ప్రత్యేకంగా అభినందించి, వారికి మెడల్స్, సర్టిఫికెట్లు అందజేసి ఘనంగా సత్కరించారు. విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చాటడం గ్రామానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్తులో మరిన్ని జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో కూడా రాణించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులను కరాటేలో నైపుణ్యం కలిగిన క్రీడాకారులుగా తీర్చిదిద్దిన కరాటే మాస్టర్, కోచ్ ఎమ్. రాజ్కుమార్ ను సర్పంచ్ గొండ రాజేంద్ర ప్రత్యేకంగా అభినందించారు. పిల్లల్లో కరాటే పట్ల ఆసక్తి, క్రమశిక్షణను పెంపొందిస్తూ వారిని విజయపథంలో నడిపిస్తున్న కోచ్ రాజ్కుమార్ సేవలను ప్రశంసించారు.ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ, తమ పిల్లలను బంగారు పతకాల వైపు నడిపించిన కోచ్ రాజ్కుమార్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ అభినందనలు తెలిపారు. రాత్నాపూర్ విద్యార్థుల ఈ విజయం గ్రామ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని పేర్కొన్నారు.






