23-02-2026 12:00:00 AM
ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి
జూబ్లీహిల్స్,ఫిబ్రవరి 22(విజయక్రాంతి): సామాన్య ప్రజలను సైబర్ నేరాల పట్ల అప్రమత్తం చేసే లక్ష్యంతో ఖైరతాబాద్ జోన్ పోలీస్ విభాగం ఆధ్వర్యంలో ఖైరతాబాద్ బడగణేష్ వద్ద సైబర్ అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఈ సదస్సుకు ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవళ్లి ముఖ్య ఆహ్వానితులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంకేతికత పెరుగుతు న్న కొద్దీ సైబర్ మోసాలు కూడా సరికొత్త రూపాల్లో సామాన్యులను పలకరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం యువత, పిల్లలు ఎక్కువగా ఆడే మొబైల్ గేమింగ్ ద్వారా జరుగుతున్న మోసాల గురించి ప్రత్యేకంగా వివరించారు. క్యాండీ క్రష్ వంటి ఆటల్లో లెవల్స్ మారుతున్నప్పుడు వచ్చే ’ఫ్రీ గిఫ్ట్’ ఆఫర్లను క్లిక్ చేయడం ద్వారా ప్రమాదకరమైన యాప్లు డౌన్లోడ్ అయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇలాంటి అనధికారిక లింకుల వల్ల వ్యక్తిగత సమాచారం దొంగిలించబడే ప్రమాదం ఉందన్నారు. ఆకర్షణీయమైన ఆఫర్ల పట్ల ప్రజలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని ఆమె సూచించారు. ముఖ్యంగా ఆర్థిక భద్రతకు సంబంధించి పలు సూచనలు చేస్తూ.. బ్యాంక్ ఓటీపీలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరికీ షేర్ చేయకూడదని డీసీపీ స్పష్టం చేశారు.
క్రెడిట్ కార్డ్ పరిమితి పెంచుతామని వచ్చే నకిలీ ఫోన్ కాల్స్, మెసేజ్ ల పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. ఏవైనా అనుమానాలు ఉంటే నేరుగా సంబంధిత బ్యాంక్ మేనేజర్ను సంప్రదించడం ఉత్తమమని తెలిపారు. సైబర్ భద్రత పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉంటూ, అనుమానాస్పద లింకులకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఖైరతాబాద్ ఇన్స్పెక్టర్ వెంకట్ రెడ్డి, డీఐ బాలస్వామి, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.