గాడుదల గండి గుట్ట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
బాధితులను పరామర్శించిన మంత్రి శ్రీధర్ బాబు
మంథని,(విజయక్రాంతి): మంథని నుంచి తమ స్వగ్రామాలకు తిరిగి వెళ్తుండగా గాడుదల గండి గుట్ట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖాన్ సాయిపేట గ్రామానికి చెందిన కలకొండ తిరుపతిరెడ్డి, బట్టుపల్లి గ్రామానికి చెందిన ఆశా వర్కర్ ఆయిలీ రాజేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం కరీంనగర్లోని కే.సీ. డయాగ్నస్టిక్ సెంటర్లో చికిత్స పొందుతున్న బాధితులను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు శుక్రవారం నేరుగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితిని మరియు వారికి అందుతున్న అత్యవసర చికిత్స వివరాలను మంత్రి అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు ఎలాంటి లోటు రాకుండా మెరుగైన, నాణ్యమైన వైద్యం అందించాలని ఆస్పత్రి యాజమాన్యాన్ని ఆదేశించారు. అనంతరం ప్రమాద వివరాలను అడిగి తెలుసుకుని, తీవ్ర ఆందోళనలో ఉన్న బాధితుల కుటుంబ సభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు ధైర్యం చెప్పారు. బాధితులు ఇద్దరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ, వారికి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.






