దుండిగల్ సర్కిల్ పరిధిలో ఆక్రమణల తొలగింపు
భారీ డ్రైవ్ నిర్వహించిన అధికారులు
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): నగర శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలను తగ్గించడం, రహదారులను పాదచారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా దుండిగల్ సర్కిల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. సర్కిల్ పరిధిలోని మల్లంపేట్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 4ఎ నుండి మల్లంపేట్, బాచుపల్లి మార్గంలో సుమారు 1.5 కిలోమీటర్ల మేర రహదారిని ఆక్రమించి ఏర్పాటు చేసిన దాదాపు 32 అక్రమ ఫుడ్ స్టాల్స్ను అధికారులు గుర్తించారు. గుర్తించిన వాటిలో ఇప్పటివరకు 24 ఆక్రమణలను విజయవంతంగా తొలగించారు.
ఈ సందర్భంగా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఎస్. వెంకట మణి కరణ్ మాట్లాడుతూ... ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని రహదారులపై ఆక్రమణలను సహించేది లేదని స్పష్టం చేశారు. అనుమతులు లేకుండా రోడ్డు పక్కన వ్యాపారాలు చేయడం వల్ల ట్రాఫిక్ అంతరాయం కలగడమే కాకుండా, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.మిగిలిన వాటిని కూడా త్వరలోనే తొలగించనున్నట్లు వెల్లడించారు. నిబంధనలను ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో దుండిగల్ సర్కిల్ ఏసీపీ శ్రీనివాస్, టీపీఎస్ ముఖేష్ సింగ్, టౌన్ ప్లానింగ్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది పాల్గొన్నారు.






