26 June, 2026 | 2:28 AM

గ్రామ స్థాయి నుంచే అభివృద్ధికి నాణ్యమైన ప్రణాళికలు రూపొందించాలి: కలెక్టర్ అంకిత్

26-06-2026 01:17 AM

సమగ్ర గ్రామాభివృద్ధికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలి

భద్రాద్రి కొత్తగూడెం, జూన్ 25 (విజయక్రాంతి): గ్రామ స్థాయిలో ప్రజల అవసరాలు, మౌలిక సదుపాయాలు, స్థానిక సమస్యలను గుర్తించి నాణ్యమైన గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని, గ్రామాల సమగ్రాభివృద్ధికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. గురువారం ఐడీఓసీ సమావేశ మందిరంలో  కలెక్టర్ అధ్యక్షతన, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి విద్యచందన , జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి నాగలక్ష్మి, డి ఆర్ ఓ పద్మావతి ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (జీపీడీపీ)పై ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లకు ఒక రోజు ఓరియంటేషన్ కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ గ్రామస్థాయిలో ప్రజా అవసరాలు, ప్రజా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తూ సమర్థవంతమైన అభివృద్ధి ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక (GPౄP), పంచాయతీ అడ్వాన్స్ ఇండికేటర్స్ (PAI), పీఏఐ సూచికలను జీపీడీపీతో అనుసంధానం చేయడం ద్వారా నాణ్యమైన గ్రామాభివృద్ధి ప్రణాళికలను రూపొందించే విధానంపై విస్తృతంగా అవగాహన కల్పించారు.  అలాగే 16వ ఆర్థిక సంఘం మార్గదర్శకాలు, పెసా గ్రామ పంచాయతీలు, సభాసర్, నిర్ణయ్ యాప్, ఈ-గ్రామ స్వరాజ్ పోర్టల్ వినియోగంపై వివరించారు. ఈ కార్యక్రమం లో సంబంధిత జిల్లా అధికారులు, కొత్తగూడెం, భద్రాచలం డివిజన్ల డీఎల్పీఓలు, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు, పంచాయతీ కార్యదర్శులు, కంప్యూటర్ ఆపరేటర్లు  సిబ్బంది పాల్గొన్నారు.