ఎస్ఐఆర్పై ప్రజల్లో అవగాహన పెంపొందించాలి
చైతన్యపురి సమావేశంలో నాయకుల సూచన
నిజమైన ఓటర్లకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ నిర్వహించాలని అధికారులకు విజ్ఞప్తి
నాగోల్, జూన్ 25 (విజయక్రాంతి): మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై అవగాహన సమావేశం చైతన్యపురి డివిజన్ ప్రభాత్నగర్లోని కల్వ మాధవరెడ్డి కమ్యూనిటీ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ఈఆర్వో మరియు ఎంఎంసీ సరూర్నగర్ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా సమావేశంలో పాల్గొన్న ప్రజాప్రతినిధులు, నాయకులు ప్రజల్లో ఉన్న అనుమానాలను అధికారులు నివృత్తి చేయాలని కోరారు. నిజమైన ఓటర్లకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా ఎస్ఐఆర్ ప్రక్రియను పారదర్శకంగా, సాఫీగా నిర్వహించాలని సూచించారు.
అలాగే డబుల్ ఓట్లు, మరణించిన వారి పేర్లతో ఉన్న ఓట్లు, లేని వ్యక్తుల పేర్లతో నమోదైన ఓట్లను తొలగించి, అర్హులైన కొత్త ఓటర్ల పేర్లను నమోదు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జిన్నారం విట్టల్ రెడ్డి, డివిజన్ అధ్యక్షుడు మహేష్ యాదవ్, సీనియర్ నాయకులు నర్సిరెడ్డి, త్రివేది, చైతన్యపురి డివిజన్ బీఆర్ఎస్ బీఎల్ఏలు పాల్గొన్నారు.






