యోగాతో శారీరక–మానసిక ఆరోగ్యం సాధ్యం
జిల్లా కలెక్టర్ కె. హరిత
కుమ్రం భీం ఆసిఫాబాద్( విజయక్రాంతి): యోగా సాధన ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఒత్తిడిని సమర్థవంతంగా జయించవచ్చని జిల్లా కలెక్టర్ కె. హరిత అన్నారు. శుక్రవారం యోగ ఫర్ వన్ ఎర్త్ – వన్ హెల్త్ నినాదంతో కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన యోగా కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేటి వేగవంతమైన జీవనశైలిలో పెరుగుతున్న ఒత్తిడి, అనారోగ్య సమస్యలకు యోగా ఒక సమగ్ర పరిష్కారమని అన్నారు. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాకుండా ఆరోగ్యకరమైన జీవన విధానమని, దీన్ని ప్రతిరోజూ ఆచరించడం ద్వారా శరీరానికి దృఢత్వం, మనసుకు ప్రశాంతత లభిస్తాయని అన్నారు.
యోగా ద్వారా రోగనిరోధక శక్తి పెంపొందడమే కాకుండా జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభించడం వల్ల వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా కుటుంబం, సమాజం మొత్తానికి సానుకూల ప్రభావం ఉంటుందని అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి యోగా కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. జిల్లాలో యోగా పట్ల అవగాహన పెంపొందించేందుకు మరిన్ని కార్యక్రమాలు చేపడతామని అన్నారు.
విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని చిన్న వయస్సు నుంచే యోగా అలవాటు చేయడం అత్యంత అవసరమని తెలిపారు. యోగా సాధన వల్ల విద్యార్థుల్లో ఏకాగ్రత, క్రమశిక్షణ, మానసిక స్థిరత్వం పెరుగుతాయని అన్ని అన్నారు ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రతి పాఠశాలలో ఉదయం పాఠాలు ప్రారంభానికి ముందు యోగా నిర్వహణను చేపట్టాలని అన్నారు .ఈ కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీఆర్డీఓ దత్తారావు, వైద్యులు, వివిధ శాఖల జిల్లా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.




