గ్రామపంచాయతీ కార్మికులకు పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి
పెరుగుతున్న జనాభా కనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలి
ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టి యు సి ఐ) జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి
పినపాక,(విజయక్రాంతి): గ్రామపంచాయతీ కార్మికులకు జీవో నెంబర్ 6 ప్రకారం జీవో నెంబర్ 60 ప్రకారం కేటగిరీల వారీగా వేతనాలు చెల్లించాలని, పీఎఫ్, ఈఎస్ఐ ,ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, పెరుగుతున్న జనాభా కనుగుణంగా కార్మికుల సంఖ్యను పెంచి పని భారం తగ్గించాలని, గ్రామపంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాలు చెల్లించాలని, ప్రతి నెల ఒకటో తారీఖున వేతనాలు చెల్లించాలని ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా (టియుసిఐ) జిల్లా అధ్యక్షులు ఆర్. మధుసూదన్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలో భాగంగా సోమవారం పినపాక ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి ఎంపీడీవో కు ఎంపీవోకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ వేతనాల పెంపుదల జీవో 6 ను విడుదల చేస్తూ వేలాది మంది గ్రామపంచాయతీ వర్కర్ల ను కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ వర్కర్స్ గా గుర్తించి జీవో నెంబర్ 6 ప్రకారం పెంచిన వేతనాలను గ్రామపంచాయతీ కార్మికులకు వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.






