కొనసాగుతున్న మేడారం జాతర
భక్తులతో కిక్కిరిసిపోయిన గద్దెల ప్రాంగణం
మహబూబాబాద్, మార్చి 1 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర ముగిసి నెల రోజులు దాటుతున్నా ప్రతి ఆదివారం వచ్చిందంటే చాలు మేడారంలో మళ్లీ జాతర కోలాహలం కనిపిస్తోంది. ఇదే తరహాలో ఆదివారం మేడారంలో భక్తుల సందడి కొనసాగింది. విశేషమేమిటంటే భారీ ఎత్తున భక్తులు తరలి రావడంతో జంపన్న వాగు నుంచి గద్దెల ప్రాంగణం వరకు ఒకవైపు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించింది.
వందలాది వాహనాలు చాలాసేపు నిలిచిపోయాయి. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేయడానికి శ్రమించాల్సి వచ్చింది. జాతర సందర్భంగా నిర్వహించినట్లుగానే భక్తులు సమ్మక్క సారలమ్మ వనదేవతలకు ఎత్తు బంగారం (బెల్లం), ఎదురుకోళ్లు, ఒడిబియ్యం, చీరే, పసుపు బండారి, కొబ్బరికా యలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గద్దెల ప్రాంగణం పూర్తిగా భక్తులతో కిక్కిరిసిపోయింది.




