ఆల్విన్ కాలనీ, షంషీగూడ డివిజన్లలో వన్ వార్డ్ ఎవ్రీ డే
పాల్గొన్న పీఏసీ చైర్మన్ గాంధీ, సీఎంసీ కమిషనర్ శ్రీజన
కూకట్పల్లి, జూలై 22 (విజయక్రాంతి): వన్ వార్డ్ ఎవరీ డే కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధి ఆల్విన్ కాలనీ, షంషీగూడ డివిజన్లో సిఎంసి కమిషనర్ శ్రీజన బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పిఎసి చైర్మన్, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా డివిజన్ లోని రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుల తో సమావేశమై వార్డులలోని పౌర సంబంధిత సమస్యలు, మౌలిక వసతులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
స్థానికులు మురుగు నీటిపారుదల, మంచినీటి సరఫరా, రహదారుల నిర్వహణ,వీధి దీపాల నిర్వహణ, చెత్తను తరలించడం, పారిశుద్ధ్య సేవలపై ఎదురవుతున్న సమస్యలను కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఇట్టి సమస్యలపై కమిషనర్ సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్య నిర్వహణలో పారదర్శకత కోసం స్ప్రేయింగ్, గ్యాంగ్ స్వీపింగ్ షెడ్యూలను రూపొందించి రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్,సభ్యులతో పంచుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు.
ఇంటింటి చెత్త సేకరణను మరింతగా సమర్థవంతంగా నిర్వహించేందుకు 400 గృహాల నుండి 500 గృహాల వరకు వ్యర్థాలను సేకరించే సామర్థ్యం కలిగిన కొత్త ఎలక్ట్రికల్ వాహనాలను వినియోగంలోకి తీసుకురావాలని సూచించారు. గుర్తించిన అన్ని పౌర సమస్యలను తదుపరి వార్డు సందర్శనకు ముందే పరిష్కరించాలని, ప్రతి ఫిర్యాదుకు నిర్దిష్ట గడువు నిర్ణయించి పనుల పురోగతిపై స్థానికులకు సమాచారం అందించాలని అధికారులకు సూచించారు.
పీఏసీ చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కాలనీల సమస్యలను ప్రధమ ప్రాధాన్యతగా గుర్తించి పనులలో అలసత్వం వహించకుండా త్వరితగతిన పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆల్విన్ కాలనీ, షంషీగూడ, డివిజన్ లలో రోడ్లు, డ్రైనేజీ, వీధిదీపాలు, మంచినీటి సరఫరా మొదలైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి జోనల్ కమిషనర్ మయాంక్ సింగ్, ఆల్విన్ కాలనీ డిప్యూటీ కమిషనర్ చాముండేశ్వరి, మాజీ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్, తులసి నగర్ త్రీ అధ్యక్షుడు జితేందర్ రెడ్డి,సర్కిల్ అధికారులు, కాలనీల అసోసియేషన్ ప్రతినిధులు,తదితరులు పాల్గొన్నారు.






