అధికారులు సమన్వయంతో పనిచేయాలి
పరిశుభ్రతను మెరుగుపరచడమే లక్ష్యంగా
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి
బోడుప్పల్ సర్కిల్ లో విస్తృతంగా పర్యటించిన కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి
మేడిపల్లి,(విజయక్రాంతి): పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ విజయ్ కృష్ణారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా బోడుప్పల్ సర్కిల్ పరిధిలో విస్తృతంగా పర్యటించి, చెత్త నిర్వహణ, స్వచ్ఛ ఆటో వాహనాల ద్వారా ఇంటింటి చెత్త సేకరణ విధానం, వాటి అవసరాలపై సమీక్షనిర్వహించి, డిప్యూటీ కమిషనర్ ఎ.శైలజ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాహ్నవి శశాంక్ లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సర్కిల్ పరిధిలో చెత్త సేకరణ ప్రక్రియ సక్రమంగా జరుగుతోందా, ఎక్కడైనా లోపాలు ఉన్నాయా అనే విషయాలను పరిశీలించారు. రహదారులకు రెండు వైపులా పేరుకుపోయిన చెత్తను పూర్తిగా తొలగించాలని అధికారులకు సూచించారు. అలాగే గార్బేజ్, వల్నరబుల్ పాయింట్స్ లను సమర్థవంతంగా తొలగించి, అక్కడ మళ్లీ చెత్త పేరుకుపోకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
స్వచ్ఛ ఆటో వాహనాల సంఖ్యను పెంచి ఇంటింటి చెత్త సేకరణను మరింత బలోపేతం చేయాలని, ప్రజలు చెత్తను రోడ్లపై వేయకుండా, స్వచ్ఛ ఆటోలకు మాత్రమే అప్పగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని తెలిపారు. బోడుప్పల్ సర్కిల్ పరిధిలో పరిశుభ్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కమిషనర్ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఎఇ మహేష్, సానిటరీ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.




