27 February, 2026 | 1:58 PM

టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలి

27-02-2026 12:00 AM

బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

ముషీరాబాద్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఖాళీగా ఉన్న 40వేల ఉపాధ్యాయ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని జాతీయ బీసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ర్యాగ అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో నిరుద్యోగులతో విద్యాశాఖ కార్యాలయం వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ టీచర్ పోస్టులు భర్తీ చేయక పోవడం తో 12 వేల పాఠశాలలో ఇంగ్లీష్, మథ్స్, సైన్స్ పాఠాలు చెప్పేవారు లేరన్నారు. విద్యార్థులుకు ఈ సబ్జెక్టులో విషయ పరిజ్ఞానం లేక చదువులల్లో వెనుకబడి పోతున్నారని తెలిపారు. దీనిలో బేసిక్ విషయ పరిజ్ఞానం లేక జాతీయ పరీక్షలలో పోటీలో నీట్, ఇంజనీరింగ్, మెడిసిన్ తదితర పోటీ పరీక్షలలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేకపోతున్నారని తెలిపారు. ఇటీవల జూన్ లో 6 వేల మంది రిటైర్ అయ్యారని తెలిపారు.

దాదాపు గత ఆగస్టులో 4500 టీచర్లకు ప్రమోషన్లు ఇచ్చారన్నారు. అలాగే గత డీఎస్సీలో సెలక్ట్ అయిన వారిలో దాదాపు 2వేల మంది జాయిన్ కాలేదన్నారు. ప్రభుత్వ పాఠశాలలు 12 వేల పోస్టులు గాకా ఇంకా ఎయిడెడ్ పాఠశాలలు 5900, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యాశాఖ గురుకుల పాఠశాలల్లో రూ.8 వేలు, ఆదర్శ పాఠశాలలు 1200, కస్తూర్బా పాఠశాలలు, 1500 ఇలా అన్నింటిలో కలిపి దాదాపు 40 వేల టీచర్ పోస్టు లు ఖాళీగా ఉన్నాయన్నారు.

గెస్ట్ టీచర్స్, పార్ట్ టైం టీచర్స్ ను నియమించి పాఠాలు చెబుతున్నారని తక్షణమే వీటిని భర్తీ చేయాలనీ కోరారు. కార్యక్రమంలో నిరుద్యోగ జాక్ చైర్మన్ నీల వెంకటేష్, రాజేందర్, అనంతయ్య, అంజి గౌడ్, శివ కుమార్ యాదవ్, అష్మా, సురేష్ కుమార్, ఇంద్ర నాయక్ తదితరులు పాల్గొన్నారు.